మినుము పంటలో పంటకోత ప్రయోగాలు
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని చుండి, అయ్యవారిపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం మినుము కోతలు జరుగుతున్నాయని, మినుము అనంతరం నువ్వు పంట సాగు చేసుకుంటే లాభదాయంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం నువ్వులు మార్కెట్లో 13,000/- నుండి 14,000/- వరకు మంచి గిట్టుబాటు ధర ఉందన్నారు. మినుము అనంతరం నువ్వు పంట సాగు చేసుకోవలసినదిగా సూచించారు. కావలసిన విత్తనాలు నువ్వుల రకాలు వై.ఎల్.ఎం 146, వై.ఎల్.ఎం 66 రకాలు చిన్న పావని రీసెర్చ్ స్టేషన్ నందు అందుబాటులో ఉన్నాయని, కావలసిన రైతులు మీ గ్రామ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ రబీలో సాగు చేసిన పంటలన్నీ ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా కోరారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల భీమా చెల్లించి ఉన్న రైతులకు పంటల బీమా పొందాలి అంటే ఈ పంట నమోదు తప్పనిసరి అని అన్నారు. మీ గ్రామ పరిధిలోని వ్యవసాయ ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచనలు ఇచ్చారు. అనంతరం చుండి గ్రామంలోని చెరువుపల్లి ప్రభాకర్ మినుము పొలంలో వ్యవసాయ సహాయకులు పంట కోత ప్రయోగం నిర్వహించారు. రైతులతో కలిసి 5 * 5 మీటర్లు మార్కింగ్ చేసుకొని దానిలో వచ్చిన దిగుబడిని ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. దాని ద్వారా భీమా చెల్లించిన రైతులకు పంటల భీమా పొందే అవకాశం ఉంటుందని, పంటకోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబలను బట్టి ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు పి.నాగరాజు, సిహెచ్ రవీంద్ర, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ డేగ వెంకటేశ్వర్లు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.