ఏమ్మా ! చెత్తను సరిగా వేరు చేస్తున్నారా ?
ఎంఆర్ఎఫ్ సెంటర్ ను బటన్ నొక్కి ప్రారంభించిన నారా చంద్రబాబునాయుడు
దూబగుంటలో మహిళలతో చంద్రన్న మాటామంతి
దూబగుంట వద్ద ఎంఆర్ఎఫ్ సెంటర్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న సీఎం
BSBNEWS - KANDUKUR
స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం కందుకూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపాలిటీ పరిధిలోని దూబగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కండి మినరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో దూబగుంట వద్ద 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. యంత్ర పనితీరును నిశితంగా పరిశీలించి సిబ్బంది నుండి వివరాలు అడిగి సేకరించారు. ఈ సెంటర్ ద్వారా రోజుకు 25 టన్నుల వ్యర్థాలను వేరుచేసి పునర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. భీమని హరికృష్ణ ఇంటిలో ఇంకుడుగుంతను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
గొర్రెపాటి సుశీల ఇంటి వద్ద ఆగి తడి చెత్త, పొడి చెత్త వేరుగా సేకరిస్తున్నారా అని అడిగారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లును పరామర్శించారు. పెన్షన్ అందుతుందా పెద్దాయనా అంటూ ప్రేమగా పలకరించగా, పింఛన్ వస్తుందని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. అక్కడున్న గ్రామస్తులతోనూ ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలో బెల్లంకొండ అనసూయమ్మ సేంద్రీయ పద్ధతిలో సాగుచేసిన అరటిపండ్ల గెలను ముఖ్యమంత్రికి బహూకరించగా, ఆయన సంతోషంగా స్వీకరించారు. అనంతరం దూబగుంట కుంట వద్ద ప్లాంటేషన్ ను పరిశీలించి గ్రామ మహిళలు ఆత్తింటి గోవర్ధిని, సుమలత, రమాదేవి, వీణ, భారతి లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలికలు ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగడానికి పోటీపడగా, ఆయన వారందరితో ఓపికగా ఫోటోలు దిగారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, దగుమాటి కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, కాకర్ల సురేష్, ఎం ఎం కొండయ్య, ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, సి డి యం ఎ సంపత్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ మరియు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.